21, మార్చి 2024, గురువారం

క్షీరసాగర మథనం విష్ణుమూర్తి రెండు అవతారాలకు వేదిక/భాగవత కథలు/kurmavataram

      శ్రీమహావిష్ణువు రెండు అవతారాలకు వేదిక క్షీరసాగరమధనం. ఎంతోమంది దేవీ దేవతలు ఆవిర్భవించిన సందర్భం. అమృతంతో పాటు ఎన్నో అపురూప ఆవిష్కరణలు క్షీరసాగర మథనం లో జరిగాయి. పరమేశ్వరుడు గరళకంటుడు అంటారు... అసలెందుకు గరళకంటుడు అయ్యాడు. శివుడి గరలకంతుడు అన్న పేరుకి క్షీరసాగర మధనానికి సంబంధమేంటి? 

     ఎంతో ఉత్సాహంగా, సంరంభంగా క్షీరసాగర మధనం ప్రారంభమయింది. మందరగిరిని కవ్వంగా, సర్పరాజు వాసుకిని కవ్వపుతాడుగా చేసుకొని దేవ,దానవులు చిలకడం ప్రారంభించారు. మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చిందట. ఆరొదకే  ఎన్నో జీవరాశులు మరణించాయట.  అయితే సాగరంలో . అడుగున కుదురు లేనందున బరువైన మందరగిరి మునిగిపోవడం మొదలయింది.  పని ప్రారంభంలోనే ఇలాంటి ఆటంకం ఏర్పడడంతో రాక్షసులు దేవతలూ అందరూ హతాశులయ్యారు. మందర పర్వతాన్ని మళ్ళీ పైకి ఎత్తడానికి శతవిధాలా ప్రయత్నించి ఓడిపోయారు. ఏం చెయ్యాలో పాలుపోక నిలబడిపోయారు.



     కూర్మావతార ఆవిర్భావం

        క్షీరసాగర మధనంలో ఏర్పడిన ఈ ఆటంకమే శ్రీమహావిష్ణువు రెండవ అవతారం కూర్మావతారానికి నాంది పలికింది. ఎప్పుడు ఏ ఆటంకం వచ్చినా దేవతలకు అండగా నిలబడే శ్రీమన్నారాయణుడు రంగంలోకి దిగాడు. సముద్రపు నీళ్ళల్లో మునిగిపోతున్న మందర పర్వతాన్ని చూసిన విష్ణుయూర్తి సముద్రంలో దిగాడు, మహా కూర్మంగా మారిపోయాడు. అదే కూర్మావతారం. దశావతారాలలో రెండవ అవతారం.  ఆ కూర్మం అంటే  తాబేలు లక్ష ఆమడల వెడల్పైన చదునైన వీపుడిప్పతో, బ్రహ్మాండాన్ని సైతం మ్రింగగల పెద్ద నోటితో, లోకంలోని ప్రాణులన్నింటినీ ఇముడ్చుకోగల కడుపుతో, కమలాల లాంటి కళ్ళతో, లోపలకూ బయటకు కదలాడే పెద్ద మూతితో, బలమైన పాదాలుతో ఉన్న ఆ మహాకూర్మం సముద్రంలో ప్రవేశించి మందార పర్వతం కిందికి చేరి ఆ పైకెత్తింది. దాంతో అందరూ జేజేల పలికారు.  విష్ణుమూర్తి కూర్మావతారాన్ని ధరించిన ఈ  కథను వినినా,  చదివినా కూడా  సంసార సముద్రంలో మునిగిపోయే జనులు గొప్ప పుణ్యాన్ని, సుఖాన్నీ పొందుతారని పురాణ కథనాలు చెప్తున్నాయి.


                  కూర్మం మళ్ళీ మందరగిరిని సాగరం పైకి ఎత్తి పెట్టడంతో  అపరిమిత ఆనందంతో పోటీపడి సముద్రాన్ని మధించసాగారు దేవదానవులు. అలా మధించగా అల్లకల్లోలమైన సముద్రం నుంచి జలచరాలన్నీ ఎగిరి గట్టుపై పడ్డాయి. సముద్రం నుంచి అగ్నిజ్వాలలు ఎగిసాయి. ఆ వెనువెంటనే తరువాత హాలాహలం అనే విషం వచ్చింది. బ్రహ్మాండం బద్దలయినట్టుగా ఆ హాలాహలం అంతటా విస్తరించింది. అందరూ హాహాకారాలు చేయసాగారు. ఆ విషజ్వాలల  వేడికి ఎంతో మంది దేవతలు రాక్షసులు భస్మమయ్యారు. చెల్లాచెదురయి పరుగులు పెట్టసాగారు.

     గరళకంటుడైన శివుడు

అప్పుడు బ్రహ్మాది దేవతలు కైలాసానికి వెళ్ళి మహేశ్వరుడికి తమ కష్టాన్ని మొర పెట్టుకున్నారు. పరమేశ్వరా... చంద్రశేఖరా... రక్షమాం రక్షమాం. నీవే మాకు దిక్కు. శంకరా... ఆపదలను తొలగించే ఆపద్భాందవా... నీవు తప్ప మాకు దిక్కులేదు. క్షీర సాగర మధనంలో వచ్చిన ఆ హాలాహలాన్ని  గ్రహించి దయతో మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకున్నారు.

భోళాశంకరుడు వారి ప్రార్థన సావకాశంగా విన్నాడు. పరమేశ్వరుడు ఆ మహా గరళాన్ని తన చేయి చాచి పట్టుకొని ముద్దగా చేసి నేరేడు పండును మింగినట్టు గొంతులో వేసుకున్నాడు. సమస్త లోకాలకు నివాస స్థానం పరమేశ్వరుని కుక్షి అంటే కడుపు. పరమేశ్వరుడు మింగిన ఆ గరళం గొంతు దాటి, కడుపులోకి చేరితే సమస్త లోకాలు ఆపదలో పడిపోతాయి. అందుకే శివుడు ఆ విషాగ్నిని మ్రింగకుండా గొంతులో పట్టి ఉంచాడు. అలా మ్రింగకుండా గొంతు దాటకుండా ఆ హాలాహలం గ్రొంతులోనే ఉంచడం వలన ఆ విషాగ్ని వేడికి ఈశ్వరుని కంఠంపై నలుపు రంగు ఏర్పడింది. అలా ఈశ్వరుడు  నీలకంటుడు, గరళకంటుడు అయ్యాడు. శివుని ఈ “హాలాహలభక్షణం” కథను విన్నా,  చదివినా వారు ఎటువంటి  భయానికి గురికారు. అలాగే  పాముల వల్లనూ, త్రేళ్ళ వల్లనూ, అగ్ని వల్లనూ కష్టాన్ని పొందరు అని ఫలశ్రుతి చెబుతోంది.



అనంతరం దేవతలూ, రాక్షసులూ సముద్ర మధనం మరల కొనసాగించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తిరుమల శ్రీవారికి పగిలిన కుండలో పెట్టే నైవేద్యం ఏంటో తెలుసా!? /odu naivedyam in tirumala

          తిరుమల శ్రీవారికి ప్రతి నితం రక రకాల పిండివంటలు , అన్నప్రసాడం , తీపిపదార్ధాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, చక్కెరపొంగలి , ...